చాట్రాయిలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
రూ.50, రూ.52కే నాణ్యమైన బియ్యం.. ప్రజలకు ప్రభుత్వ కానుక – తహశీల్దార్ జి. శ్వేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలోని చాట్రాయి గ్రామం జనార్ధనవరం రోడ్డులో ఉన్న శ్రీ దివ్య వాసవి జనరల్ స్టోర్స్ (గోళ్ళ బదరీ కిరాణా దుకాణం)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక బియ్యం విక్రయ కార్యక్రమానికి తహశీల్దార్ జి. శ్వేత శుభారంభం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, ఉమ్మడి కూటమి నాయకులు, అధికారులు హాజరై ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక బియ్యం విక్రయ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మార్కెట్లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజలకు ఆర్థికంగా ఊరట కలిగించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
బియ్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా ఆధార్ కార్డు ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో కొనుగోలు చేసి కుటుంబ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రజాపయోగ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకొస్తున్న ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు తుమ్మల జగన్, సవరం రామారావు, ఆదిమూలం నాగ మోహన్ శర్మ, వెల్లంకి శివన్నారాయణతో పాటు పలువురు టీడీపీ నాయకులు కమ్ముల కొండల రావు, రాయవరపు పుల్లారావు, శంకర్, లక్ష్మీ నారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.