అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త విధానం
జనన, మరణ రికార్డులను మరింత కచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు సకాలంలో నమోదు జరిగేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం జనన, మరణాలను నిర్ణీత సమయంలో నమోదు చేయడంపై మరింత దృష్టి సారించనున్నారు. ఆలస్యంగా నమోదయ్యే సందర్భాల్లో సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రెండేళ్లకు మించి ఆలస్యంగా జనన లేదా మరణ నమోదు చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి కానుంది. దీంతో ఆలస్య నమోదులో అక్రమాలు, తప్పుడు వివరాల నమోదు వంటి వాటికి అడ్డుకట్ట వేయడంతో పాటు రికార్డుల విశ్వసనీయతను పెంచే అవకాశం ఉంది.
జనన, మరణ వివరాలు భవిష్యత్తులో పలు ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు, పౌర సేవలకు కీలక ఆధారాలుగా ఉండటంతో వాటి నమోదు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడమే కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.