చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రూ.116 కోట్లకు ప్రభుత్వం ఆమోదం
చేప పిల్లల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రూ.116 కోట్లకు ప్రభుత్వం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చేపలు, రొయ్య పిల్లల కొనుగోలు కోసం రూ.116 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం నిర్ణయంతో టెండర్ల ప్రక్రియ పూర్తైన వెంటనే రాష్ట్రంలోని చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని సుమారు 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది.
ఈ చర్యతో చెరువుల్లో చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించనుంది.
ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేపల ఉత్పత్తి పెరిగి తమ జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.