చెర్వుగట్టు ఆలయ నిధుల దుర్వినియోగం : కంప్యూటర్ ఆపరేటర్ అరెస్ట్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు గుట్ట కింద ఉన్న పార్వతమ్మ దేవస్థానంలో రూ. 1,03,000/- ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ డి. వంశీకృష్ణరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఆలయ రోజువారీ ఆదాయ రిజిస్టర్ డిసిబి బ్యాంకు డిపాజిట్లను సీనియర్ అసిస్టెంట్ సిహెచ్. లింగయ్య పరిశీలించగా తేడాలు బయటపడ్డాయి. మే 19న ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవస్థాన చైర్మన్, ఈవో, ధర్మకర్తల మండలి సమక్షంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇందులో కోడె త్రిప్పికట్టు టికెట్ల ద్వారా రూ. 89,500, గది కిరాయిల ద్వారా వచ్చిన రూ. 13,500 కలిపి మొత్తం రూ. 1.03 లక్షల ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయకుండా, రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసి వంశీకృష్ణరావు సొంతానికి వాడుకున్నట్లు తేలింది.
దీనిపై వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జూన్ 25న జరిగిన పాలకమండలి సమావేశంలో సదరు ఆపరేటర్ను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.