ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 90 శాతం వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన మొత్తాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతామని వెల్లడించారు.
జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నందున డిజిటలైజేషన్ పూర్తయ్యాక సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, ఓటర్లు ఆందోళన చెందకుండా నోటీసులో కోరిన ధ్రువపత్రాలను సమర్పించి ఓటు హక్కును పొందవచ్చని కలెక్టర్ సూచించారు. డబుల్, డెత్, షిఫ్టెడ్ ఓట్లను నిబంధనల ప్రకారం తొలగిస్తామని పేర్కొన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారిని గుర్తించి బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా బీఎల్ఓలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు