చింతలపూడి సర్కిల్లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు
చింతలపూడి సర్కిల్లో జూద శిబిరాలపై పోలీసుల దాడులు – 32 మంది అరెస్ట్
ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో కోడిపందాలు, పేకాట ఆడుతున్న 32 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ. 30,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జూద శిబిరాల వద్ద నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేయగా, పందాలకు సిద్ధం చేసిన 14 కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి చర్యలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.