అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు
ఎన్టీఆర్ జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, గొలుసు దుకాణాల నిర్వహణ, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడులు, ఆకస్మిక తనిఖీలు, నిఘా చర్యలను నిరంతరం చేపడుతోందని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.
ఇప్పటివరకు స్టేషన్ పరిధిలో 96 గొలుసు దుకాణాలపై కేసులు నమోదు చేసి, 96 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే 731 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 75 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన ప్రతి మద్యం దుకాణంలో పర్మిట్ రూమ్ నిర్వహణకు అనుమతి ఉందని, పర్మిట్ రూమ్లో మాత్రమే మద్యం సేవించడం చట్టబద్ధమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని చెబుతూ, అలాంటి ఘటనల్లో 9 మందిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రతి మద్యం బాటిల్ విక్రయాన్ని ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన అనంతరమే వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి విక్రయం డిజిటల్గా నమోదు కావడంతో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమ మద్యం విక్రయాలను సమర్థంగా నియంత్రించగలుగుతున్నామని చెప్పారు.
అక్రమ మద్యం విక్రయాలు, గొలుసు దుకాణాల నిర్వహణ, అధిక ధరలకు విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోందని ఎ. మస్తానయ్య స్పష్టం చేశారు.
అక్రమ మద్యం విక్రయాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో అక్రమ మద్యం నిర్మూలన, చట్టబద్ధమైన మద్యం విక్రయాల పర్యవేక్షణ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఎక్సైజ్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.