డీఎస్సీ-2025 అక్రమాలపై చింతలపూడిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష
డీఎస్సీ-2025 అక్రమాలపై చింతలపూడిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష
ఏలూరు జిల్లా, చింతలపూడి: డీఎస్సీ-2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కంభం విజయరాజు, ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిలే నిరాహార దీక్షలో పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.
డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించడంతో పాటు, గత రెండేళ్లుగా చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని ఒక్కో నిరుద్యోగికి సంవత్సరానికి రూ.75 వేల చొప్పున విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలో డీఎస్సీ-2025 అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని కంభం విజయరాజు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని జెన్-జెడ్ యువత చేపట్టిన డీఎస్సీ "పోరుబాట" ఉద్యమాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దని హెచ్చరించిన ఆయన, ఈ వ్యవహారంపై పారదర్శక విచారణ జరపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ రిలే నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు.