డ్వాక్రా మహిళలకు ఊరట.. 10 మంది సభ్యులు లేకున్నా బ్యాంకు రుణాలు
ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గినా రుణాల మంజూరుకు అడ్డంకులు లేకుండా నిబంధనలను సడలించింది.
ఇకపై డ్వాక్రా సంఘంలో 10 మంది సభ్యులు లేకపోయినా కనీసం 8 మంది క్రియాశీల సభ్యులు ఉంటే పునరావృత రుణాలు పొందే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూరనుంది.
స్త్రీనిధి పథకం ద్వారా అర్హత ఉన్న సంఘాలు సుమారు రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. అయితే రుణం మంజూరైన ఆరు నెలల్లోపు సంఘ సభ్యుల సంఖ్యను తిరిగి 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుంది.
రుణం పొందేందుకు సంఘ సమావేశం నిర్వహించి ప్రత్యేక తీర్మానం చేయాలి. అనంతరం సంబంధిత పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని అధికారులు తెలిపారు.