ధాన్యం అమ్మి పది రోజులైనా రాని పైసలు.. చిట్యాల రైతుల ఆవేదన!
ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించిన పంటను అమ్ముకున్నా చేతికి పైసలు అందక అన్నదాతలు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. గత నెల 29వ తేదీన వరి ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ట్రాక్ షీట్ ఆన్లైన్ చేయకపోవడంతో వందల మంది రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఏసీఎస్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం అమ్మి పది రోజులు దాటుతున్నా మొబైల్ ఫోన్లకు రావాల్సిన ఓటీపీ కాస్తా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మరోవైపు కొత్త పంట పెట్టుబడులకు సమయం ఆసన్నమవుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. వరి కోసిన మిషన్ల వారికి, రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులకు బిల్లులు కట్టాలి. ఎరువుల షాపుల బాకీలు తీర్చాలి. ధాన్యం ఆరబోసిన కూలీలకు, పట్టాలు అద్దెకు ఇచ్చిన వారికి పైసలు ఇవ్వాలి అని . వీరందరికీ సమాధానం చెప్పలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో పైసా లేక, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోయారు. పంట అమ్ముకున్నాక కూడా డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి రావడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెద్దకాపర్తి పీఏసీఎస్ సెంటర్ పరిధిలోని రైతుల సమస్యను ఉన్నతాధికారులు తక్షణమే పరిశీలించాలని, వెంటనే ట్రాక్ షీట్లను ఆన్లైన్ చేసి, వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.