ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ భగ్నం
ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ భగ్నం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్మగ్లింగ్ను భగ్నం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్లలో అత్యంత చాకచక్యంగా దాచిన 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులు అనుమానంతో నిఘా పెట్టారు. అనంతరం ఐజీఐ విమానాశ్రయంలో అతడి చెక్ఇన్ సామానును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించిన టైర్ల భాగంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు ఎక్స్రే పరీక్షలో గుర్తించారు.
దీంతో అధికారులు సామానును తెరిచి పరిశీలించగా టైర్లలో ప్రత్యేకంగా దాచిన 24 క్యారెట్ల బంగారం 19 ముక్కలు బయటపడ్డాయి. వాటి మొత్తం బరువు 869.5 గ్రాములుగా అధికారులు నిర్ధారించారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.
బంగారం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది, మరెవరైనా ఈ స్మగ్లింగ్లో భాగస్వాములుగా ఉన్నారా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయాల్లో అక్రమంగా బంగారం తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.