ఎర్రమాడులో సైబర్ చైతన్య రథంతో అవగాహన
తిరువూరు: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, మైలవరం ఏసీపీ పి.రామచంద్రరావు మార్గదర్శకత్వంలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గురు ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం ఎర్రమాడు గ్రామంలో సైబర్ చైతన్య రథంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు ఎస్ఐ శాతకర్ణి పాల్గొని సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జాబ్ ఫ్రాడ్, కొరియర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డు మోసాలు, ఓటీపీ మోసాలు, సామాజిక మాధ్యమ ఖాతాల హ్యాకింగ్, నకిలీ లింకులు, రుణ యాప్ మోసాలు, ఆన్లైన్ గేమింగ్ మోసాలపై సవివరంగా వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాంకు వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని తెలిపారు.
సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.