ప్రతి రైతుకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి
చాట్రాయి మండలంలోని ప్రతి రైతుకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి ఏవో బి శివశంకర్
చాట్రాయి మండలం: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులకు ఎల్నినో ప్రభావంతో పంటలపై ఏర్పడే పరిస్థితులు, రైతులకు అందించాల్సిన సూచనలు, నీటి యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత, పంట నమోదు తదితర అంశాలపై మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ అవగాహన కల్పించారు.
రైతులందరూ తమ పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకునేలా వ్యవసాయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని అన్ని పంటలను సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ సహాయకులు తరచూ పరిశీలించాలని, రైతులకు అందుబాటులో ఉంటూ నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు..
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున పంటల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన సమయంలో ద్రవ జీవామృతాన్ని పేడ, ఆవు మూత్రం, శెనగపిండి వంటి పదార్థాలతో తయారు చేసి పంటలపై పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఘన జీవామృతం, పంచకావ్యం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వినియోగించడం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలను అందించవచ్చని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. పంటలకు అవసరమైన నీటిని సమర్థంగా వినియోగించుకోవడం, నేలలో తేమను కాపాడుకోవడం వంటి చర్యలపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.
ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఏపీఎఫ్ఆర్ నమోదు పూర్తి చేసుకుని, విశిష్ట సంఖ్య గుర్తింపును రైతు సేవా కేంద్రం వద్ద పొందాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. ప్రతి రైతు పంట నమోదు, అవసరమైన గుర్తింపు ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసుకునేలా గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు.