గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల పల్లె నిద్ర....
గంపలగూడెం ఊటుకూరులో పోలీసుల ‘పల్లె నిద్ర’.. ఎన్నికల వేళ భద్రతపై ప్రత్యేక దృష్టి
ఊటుకూరు:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ మార్గదర్శకత్వంలో, మైలవరం ఏసీపీ పర్యవేక్షణలో తిరువూరు సీఐ కే. గిరిబాబు, గంపలగూడెం ఎస్సై జీ. అనిల్తో పాటు పోలీసు సిబ్బంది గురువారం రాత్రి గ్రామంలో బస చేశారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలు, భద్రతా అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ‘ఖాకీ స్టూడియో’ వీడియో ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత గంజాయి, బెట్టింగులు, ర్యాష్ డ్రైవింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రజల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అధికారులు భరోసా ఇచ్చారు. పోలీసులే స్వయంగా గ్రామంలో రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవడం పట్ల ఊటుకూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.