గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి..
గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. లంకవాసుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలి జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూడి–ఉడుముడిలంక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరియు పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగి గంటిపెదపూడి, ఉడుముడిలంకతో పాటు సుమారు 17 లంక గ్రామాలు నీటితో చుట్టుముట్టబడ్డాయని తెలిపార
ప్రతి సంవత్సరం వరదలు రావడం, లంక గ్రామాలు నీట మునగడం ఈ ప్రాంత ప్రజలకు కొత్త విషయం కాదని, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఒక శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాలను కోరుతున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ బ్రిడ్జికి నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టారని, అనంతరం వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉడుముడిలంక ప్రాంతాన్ని సందర్శించి బ్రిడ్జి నిర్మాణాన్ని మళ్లీ వేగవంతం చేశారని, ఆయన చొరవతో ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. ప్రస్తుతం కేవలం 20 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే నిధులు విడుదల చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బ్రిడ్జి నిర్మాణం కోసం స్థానిక రైతులు పూర్తి పరిహారం అందకముందే ప్రజాహితం కోసం స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికైనా వారికి తగిన భూ పరిహారం చెల్లించి, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తే విద్యార్థులు, రైతులు, ప్రజలు ప్రతి సంవత్సరం వరదల సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయని అన్నారు.
ఇప్పటికే వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించి 24 గంటలు దాటిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితులకు వెంటనే వరద సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వరద ప్రభావిత కుటుంబాలకు తక్షణమే బియ్యం, కిరోసిన్, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి నిత్యావసర వస్తువులు అందించేవారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయాన్ని వెంటనే అందించాలని కోరారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బోట్లను ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే లంక గ్రామాల్లో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున వారికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు, నిత్యావసర సరుకులు, పంట నష్టానికి సంబంధించిన ఉపశమన చర్యలు కూడా వెంటనే చేపట్టాలని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను ఇప్పుడు ప్రారంభించామని చెప్పుకోవడం కంటే, ప్రజలకు ఉపయోగపడేలా మిగిలిన 20 శాతం బ్రిడ్జి పనులను పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గంటిపెదపూడి, ఉడుముడిలంక ప్రజల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చేలా వెంటనే నిధులు విడుదల చేసి బ్రిడ్జిని పూర్తిచేస్తే ప్రతి ఏడాది వరదల సమయంలో ప్రజలు ఎదుర్కొనే కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.