హైదరాబాద్ : కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అన్నారు.
కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కాళోజీ రచనలు తెలంగాణ మట్టి వాసనను, ప్రజల కష్టాలు, ఆకాంక్షలను ప్రతిబింబించాయని పేర్కొన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని తెలిపారు.
కాళోజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ భాష, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.