పీడీ లేక నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
వరంగల్ జిల్లాలో 300 మందికిపైగా లబ్ధిదారులకు ఎదురుచూపులు
వరంగల్ | Ntoday News
వరంగల్ జిల్లాలో జిల్లా హౌసింగ్ పీడీ లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో ఇళ్లు మంజూరై, వివిధ దశల్లో నిర్మాణ పనులు చేపట్టిన 300 మందికిపైగా లబ్ధిదారులకు బిల్లుల అప్రూవల్ కావడం లేదని పేర్కొన్నారు.
గ్రామ, వార్డు స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపినప్పటికీ.. జిల్లా స్థాయిలో హౌసింగ్ పీడీ లాగిన్లో అప్రూవల్ కాకపోవడంతో బిల్లుల చెల్లింపులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో అందకపోవడంతో నిర్మాణ పనులను కొనసాగించడం కష్టంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెంటనే జిల్లా హౌసింగ్ పీడీని నియమించి, పెండింగ్లో ఉన్న బిల్లులకు అప్రూవల్ ఇచ్చి చెల్లింపులు చేపట్టాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.