కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్
దళితులకు 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా? నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
స్టేషన్ఘన్పూర్ | Ntoday News
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో దళితులకు ఇంటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా? అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించారు. స్థలం, డబ్బు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. దళితులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం, ఆర్థిక సహాయం అందించినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కి, వారిని సభ నుంచి బయటకు పంపిస్తున్నారని రాజయ్య ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను అన్నింటినీ గమనిస్తున్నారని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.