ఖర్చెంతైనా బాధ్యత నాదే.. ఉద్యమ నాయకురాలు రహీమున్నీసా బేగంకు నాయిని భరోసా
ఉద్యమకారిణి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
హనుమకొండ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యమకారిణి రహీమున్నీసా బేగంను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరామర్శించారు. హనుమకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతున్న రహీమున్నీసా బేగంకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను నాయిని రాజేందర్ రెడ్డి కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “చికిత్సకు ఖర్చెంతైనా పర్వాలేదు.. మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత. రహీమున్నీసా బేగం ఆరోగ్యం కోసం అవసరమైన సహాయం అందిస్తాను” అని భరోసా ఇచ్చారు.
ప్రజలు, సమాజం కోసం ఉద్యమ సమయంలో ముందుండి పనిచేసిన రహీమున్నీసా బేగంకు అనారోగ్య సమయంలో అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు.
రహీమున్నీసా బేగం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నాయిని రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు.