ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు దారుల డిపాజిట్ వాపస్
ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తే దానికే తిరిగి చెల్లింపు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం
Ntoday News, తెలంగాణ: ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీలో ఎంపిక కాని దరఖాస్తు దారులు చెల్లించిన రూ.10 వేల డిపాజిట్ (ఈఎండీ) మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దరఖాస్తు సమయంలో మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో స్వీకరించిన ఈ మొత్తాన్ని ఏ ఖాతా నుంచి చెల్లించారో అదే ఖాతాకు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయని తెలిపారు. అయితే మీ సేవా కేంద్రాల్లో నగదు లేదా ఇతరుల ఖాతాల ద్వారా ఈఎండీ చెల్లించిన వారు 10వ తేదీలోగా tghb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో చెల్లింపు జరిగిన ఖాతాకే నగదు తిరిగి జమ అవుతుందని స్పష్టం చేశారు.
ఎంపికైన వారి వెరిఫికేషన్
లాటరీలో ఎంపికైన వారి వివరాల పరిశీలన కొనసాగుతోందని గౌతం తెలిపారు. ప్రతిపాదించిన 7,340 ఇళ్లకు వెయిటింగ్ లిస్ట్లో కలిపి సుమారు 10 వేల మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులకు కేటాయింపు పత్రాలు అందజేస్తామన్నారు. సమాచారం వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తామని, సందేహాలుంటే 040-24603572 కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో టవర్స్ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుంది.