ఇథనాల్ దెబ్బ.. చక్కెరకు షాక్!
రూ.40 నుంచి రూ.65కు చేరిన పంచదార ధరలు
దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గతంలో కిలో రూ.40 వరకు ఉన్న చక్కెర ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.65 వరకు చేరింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.
చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగం పెరగడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంధన మిశ్రమంలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచేందుకు చెరకు పంటలో కొంత భాగాన్ని అటువైపు మళ్లించడంతో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయని అంచనా.
చక్కెర ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. డిమాండ్కు సరిపడా నిల్వలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతులపై ఉన్న సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మిల్లుల వద్ద భారీగా పెరిగిన ధరలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల వద్ద 100 కిలోల ధర రూ.5,400 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. ఏడాది క్రితం ఇదే పరిమాణం ధర సుమారు రూ.3,900 ఉండేది. అంటే భారీగా పెరుగుదల నమోదైంది.
రానున్న పండుగల సీజన్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేంద్రం నిల్వలపై దృష్టి సారిస్తోంది. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో సరఫరా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇథనాల్ ఉత్పత్తి విధానం, చెరకు వినియోగంలో మార్పులు కొనసాగితే వచ్చే ఏడాది కూడా చక్కెర ధరలపై ఒత్తిడి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.