జింకలపాలెంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ పంచాయతీ శివారు జింకలపాలెంలోని ప్రాథమిక ఉర్దూ, తెలుగు మాధ్యమ పాఠశాలలో గురువారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని గ్రామ ప్రధాన వీధుల్లో క్రమశిక్షణతో ప్రదర్శన నిర్వహించారు. ‘భారత మాతాకీ జై’, ‘ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేద్దాం’, ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని చాటారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో హిందువులతో పాటు అనేకమంది ముస్లింలు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత షేక్ షెహనాజ్ బేగం మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుంటే విద్యలో మంచి ఫలితాలు సాధించడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు ఎన్. బద్రీనాథ్, కే. నరేష్ బాబు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.