జనార్ధనవరం మహిళలు రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢం చారే చీరల సమర్పణ
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన మహిళలు కలగర గ్రామంలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి చారే చీరలు, పండ్లు, పూలు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మహిళలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామాల్లో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు.