జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించాలి: అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి డిమాండ్
అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జీరో అవర్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధుల్లో చాలామంది తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి భారంగా మారిందన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తే వారి కుటుంబాలకు సామాజిక భద్రత లభిస్తుందని తెలిపారు. గతంలో జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టు కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన జి.ఓ. నెం. 67, 107లను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సభ ద్వారా విజ్ఞప్తి చేశారు.