కాకర్ల గ్రామంలో ఎల్-నినో ప్రభావ నివారణపై రైతులకు అవగాహన
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలి
తిరువూరు:
‘‘రైతన్న మీకోసం’’ కార్యక్రమంలో భాగంగా ఎల్-నినో ప్రభావం వల్ల పంటలపై కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే చర్యలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం కాకర్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో శనివారం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరువూరు ఆర్డీఓ ఎ. కుమార్ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగులో రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారులు సూచించే పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అకాల వర్షాలు, కరువు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో పథకం నిబంధనల మేరకు బీమా పరిహారం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
రైతులు పంటల బీమా పథకంలో సకాలంలో నమోదు చేసుకుని పంటలకు బీమా రక్షణ కల్పించుకోవాలని ఆర్డీఓ సూచించారు. పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, బీమా నమోదుకు సంబంధించిన సందేహాలను వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో తిరువూరు తహశీల్దార్, వ్యవసాయ శాఖ సహాయ అధికారి, రైతులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.