తోచలక రాయుడిపాలెంలో కాలనీ మధ్యలో భారీ గొయ్యి.. భయాందోళనలో ఎస్సీ కాలనీ వాసులు
ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం: తోచలకరాయుడుపాలెం గ్రామంలోని పాత ఊరు ఎస్సీ కాలనీ మధ్యలో ఉన్న భారీ గోతిని వెంటనే పూడ్చాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయం నిర్మాణం కోసం భారీ గోతిని తవ్వినా, అనంతరం నిర్మాణ పనులు చేపట్టకుండా అలాగే వదిలేయడంతో అది ప్రస్తుతం కాలనీవాసులకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోతిలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలకు నిలయంగా మారిందని తెలిపారు.
చిన్నపాటి వర్షం కురిసినా గోతిలో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం నెలకొన్నదని కాలనీవాసులు తెలిపారు. గోతి కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గతంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి గోతిలో పడిపోయిందని, స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో పెను ప్రమాదం తప్పిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ప్రమాదకర గోతిని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరిగితేనే స్పందిస్తారా అని ప్రశ్నించారు.
చింతలపూడి ఎమ్మెల్యే , స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గోతిని పూడ్చి కాలనీవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.