కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన జనరేషన్ జెడ్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
విస్సన్నపేట: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు విస్సన్నపేటలోని కేపీఆర్ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన పోరాటంలో జనరేషన్ జెడ్ ఆదర్శవంతమైన ఉద్యమాన్ని నిర్వహించిందన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం–2020 ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే విధంగా ఈ విధానం ఉందని విమర్శించారు. జాతీయ విద్యా విధానం–2020ను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో కొనసాగుతున్న అధిక ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్న అవినీతిని జనరేషన్ జెడ్ చూస్తూ ఊరుకోదని అన్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వాలకు కాలం చెల్లుతుందని హెచ్చరించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సూచించారు. విద్యార్థుల సమస్యలపై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. నూతన జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రణయ్ తేజ, కాజు, షణ్ముఖ్, కుమార్ నాయక్, విస్సన్నపేట మండల నాయకులు ధావన్ నాయక్, శశాంక్, భార్గవ్, రాము తదితరులతో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.