కేసీఆర్పై వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ
ఒకరి చావును కోరడం సమర్థనీయం కాదు.. గత వ్యాఖ్యలను గుర్తుచేసిన ఎమ్మెల్యే
హైదరాబాద్ | Ntoday News
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఒకరి చావును కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ” అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను చూడాలని వీర్లపల్లి శంకర్ సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మహిళా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తాను ఆవేదనతో స్పందించానని, కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన ఉద్దేశం కేసీఆర్కు ఏదైనా హాని జరగాలని కోరడం కాదని స్పష్టం చేశారు.
“తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలది.. కేసీఆర్ కుటుంబానిది మాత్రమే కాదు” అని వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, స్పీకర్, మహిళా మంత్రులు తదితరులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు.
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉండొచ్చని, అయితే వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.