కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, విస్సన్నపేట తహసీల్దార్ ఆధ్వర్యంలో విస్సన్నపేట మండలం కలగర రెవెన్యూ గ్రామంలో రీ సర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. కలగర–కొర్లమండ గ్రామ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 11 పరిసర ప్రాంతాలను సందర్శించి, ఇటీవల రైతుల కోసం నిర్మించిన మట్టి రహదారిని కూడా పరిశీలించారు.
రీ సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను అధికారులు సులభమైన భాషలో వివరించారు. భూముల సరిహద్దులు స్పష్టతకు రావడం, భవిష్యత్ వివాదాలు తగ్గడం, భూముల రికార్డులు సక్రమీకరణ కావడం వంటి అంశాలను రైతులకు వివరించారు. కార్యక్రమం సుమారు 90 రోజుల పాటు కొనసాగనున్నందున రెవెన్యూ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని రైతులను కోరారు.
భూముల విస్తీర్ణంలో ఒకటి, రెండు సెంట్ల తేడాలు వచ్చినా వివాదాలు సృష్టించకుండా అధికారులకు సహకరించాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు. ఏవైనా అభ్యంతరాలు లేదా తేడాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, రైతులు దానిని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కూడా రైతులకు సూచించారు. రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళ్లపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో కొర్లమండ గ్రామంలో జరిగిన రీ సర్వే సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానం లోపం కారణంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తహసీల్దార్, మండల సర్వేయర్ చర్యలతో ఆ సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం సర్వే సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నారని, గతంలో జరిగిన తప్పులు ఇక్కడ పునరావృతం కావని అన్నారు.
కలగర గ్రామం ఎస్టేట్ గ్రామం కావడంతో ఇక్కడి భూముల రికార్డులు మరింత జాగ్రత్తగా నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో వందేళ్ల తర్వాతే రీ సర్వే అవకాశం రావచ్చని, అందువల్ల రైతులు, రైతు కూలీలు, భూమి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గతంలో పట్టాదారు పాసుబుకుల్లో కేవలం విస్తీర్ణం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అదనంగా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (FMB) వివరాలు కూడా ముద్రిత రూపంలో అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. దీంతో భూముల భద్రత మరింత బలపడుతుందని తెలిపారు.
సర్వే నోటీసులను గ్రామాల్లో జారీ చేయడంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా పంపించాలని రైతులు అధికారులను కోరారు. రెండు సర్వే బృందాలు పనిచేస్తున్నందున అధికారులు త్వరితగతిన స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ చట్టాలకు సంబంధించిన అంశాలపై మండవ రామకృష్ణ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ప్రస్తావించిన పలు సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై అధికారులు సమగ్ర వివరణ ఇచ్చారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో భూమి రికార్డుల సంరక్షణ, రైతుల సమస్యల పరిష్కారం, వివాద రహిత రీ సర్వే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు.