ఏపీ ప్రజలకు శుభవార్త.. వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసే అవకాశం
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే "మన మిత్ర" వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు పౌర సేవలను అందిస్తున్న ప్రభుత్వం, త్వరలో ప్రజల ఫిర్యాదులను కూడా వాట్సాప్ ద్వారానే స్వీకరించే విధానాన్ని తీసుకురానుంది.
ఈ కొత్త విధానంలో ప్రజలు తమ సమస్యలను టెక్స్ట్తో పాటు వాయిస్ మెసేజ్ రూపంలో కూడా పంపించే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్కు ప్రత్యామ్నాయంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వ్యవస్థను వీలైనంత త్వరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఈ సదుపాయం అమల్లోకి వస్తే ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తుది ఏర్పాట్లు చేస్తోంది.