కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. మల్లన్న భక్తులకు శుభవార్త
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయాలనే ఉద్దేశంతో రూ.5.63 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ను నిర్మించారు. ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్ ప్రారంభంతో భక్తులకు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె. లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు ఇప్పటి వరకు ప్రధానంగా బస్సులు, వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని, కొత్త రైల్వే స్టేషన్తో ఆ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. రైలు సౌకర్యంతో ప్రయాణ సమయం, ఖర్చు రెండూ తగ్గనున్నాయని చెప్పారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో చేర్యాల, మద్దూరు, నర్మెట్ట మండలాల ప్రజలకు కూడా మెరుగైన రైలు రవాణా సౌకర్యం లభించనుంది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
స్టేషన్లో 400 మీటర్ల పొడవైన హై లెవెల్ ప్లాట్ఫారం, విశ్రాంతి హాల్, టికెట్ కౌంటర్, తాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, అప్రోచ్ రోడ్లు వంటి వసతులు ఏర్పాటు చేశారు.
అలాగే సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమూ రైళ్లకు కొమురవెల్లి స్టేషన్లో హాల్ట్ కల్పించారు. సిద్దిపేట నుంచి వచ్చే రైళ్లు ఉదయం 6:45 గంటలకు, మధ్యాహ్నం 2:38 గంటలకు స్టేషన్లో ఆగుతాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు మధ్యాహ్నం 12:44 గంటలకు, రాత్రి 8:04 గంటలకు కొమురవెల్లి స్టేషన్లో ఆగనున్నాయి. దీంతో మల్లన్న భక్తులకు రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.