కోల్ బెల్ట్ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది..
కోల్ బెల్ట్ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది.. పేదలకు భూములిచ్చే వరకు పోరాటం: రఘునాథ్ వెరబెల్లి
ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నస్పూర్ జోన్ కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
కార్పొరేషన్ సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు
మంచిర్యాల / నస్పూర్:
కోల్ బెల్ట్ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ ప్రాంత ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి విమర్శించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ జోన్ అధ్యక్షులు కుర్రె చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించిన జోన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేద ప్రజలకు కేవలం భూముల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుందని, ఇప్పటి వరకు వారికి ఆ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించలేదని మండిపడ్డారు. పట్టాలు పొందిన పేదలకు వెంటనే భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగి, ఆ భూములు దక్కే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అదేవిధంగా, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న వివిధ స్థానిక సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జోన్ అధ్యక్షులు కుర్రె చక్రవర్తితో పాటు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు