విజయవాడలో ఏసీబీ పంజా..
విజయవాడలో ఏసీబీ పంజా.. రూ.7 వేల లంచం తీసుకుంటూ వార్డు సంక్షేమ కార్యదర్శి అరెస్ట్
విజయవాడ: నగరంలోని రామలింగేశ్వరనగర్ వార్డు సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కళాశాల ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు పరిశీలన కోసం రూ.7 వేల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వల పన్ని వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావును పట్టుకున్నారు.
రామలింగేశ్వరనగర్కు చెందిన పాండ్రాజు నాగదుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా సాంబశివరావును అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు.
లంచంగా తీసుకున్న రూ.7 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును స్వీకరించిన వ్యక్తిపై నిర్వహించిన రసాయన పరీక్షలో సానుకూల ఫలితం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వార్డు సచివాలయంలోని అధికారిక దస్త్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ బి.వి. సుబ్బారావు బృందం ట్రాప్ నిర్వహించగా, అదనపు ఎస్పీ కే. శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలోని బృందం వార్డు సచివాలయంలో తదుపరి విచారణ చేపట్టింది. లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.