లక్సెట్టిపేటలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’.. 46 బైకులు, ఆటో సీజ్
లక్సెట్టిపేట, : నేరాల నియంత్రణే ధ్యేయంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పోలీసులు బుధవారం ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలోని మహాలక్ష్మి వాడ, గోదావరి రోడ్, మోదల రోడ్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 46 బైకులు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అపరిచితులపై నిఘా ఉంచాలి: సీఐ రమణమూర్తి
ఈ సందర్భంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ కాలనీల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగే వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పరిచయం లేని వ్యక్తులకు, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
సైబర్ మోసాలపై అప్రమత్తత
ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు (OTP) అడిగితే చెప్పకూడదని, ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు.
మైనర్ డ్రైవింగ్పై కఠిన చర్యలు
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ప్రమాదాలు జరిగితే మైనర్లతో పాటు తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తనిఖీల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది
ఈ విస్తృత తనిఖీ కార్యక్రమంలో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసియోద్దీన్, ఉదయ్ కిరణ్లతో పాటు లక్సెట్టిపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు