లండన్లో పీజీ నుంచి... తాడేపల్లి ప్యాలెస్ గేటు వరకు: బోరుగడ్డ అనిల్ ఆవేదన
లండన్లో పీజీ నుంచి... తాడేపల్లి ప్యాలెస్ గేటు వరకు: బోరుగడ్డ అనిల్ ఆవేదన
లండన్లో పీజీ పూర్తి చేసి వచ్చి, ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసిన బోరుగడ్డ అనిల్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట నిరసనకు చేరిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ను కలవకుండా అడ్డుకుంటున్నారని, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మరియు జగన్ వ్యక్తిగత సహాయకుడు శ్రీహరి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బోరుగడ్డ అనిల్ తాడేపల్లి నివాసం వెలుపల నిరసన వ్యక్తం చేశారు.
జగన్ నివాసం బయట ఉన్న "ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మరిచిపోను" అనే ఫ్లెక్సీ ఎదుటే నిలబడి, "ఈ రోజు నాకు జరిగిన పరిస్థితి రేపు మీకూ రావచ్చు" అంటూ కార్యకర్తలకు హెచ్చరికగా వ్యాఖ్యానించారు.
అలాగే, తనపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ, తనను రౌడీషీటర్గా ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీహరి మరియు వారి అనుచరులపై బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పరిణామం అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే ప్రజలు వేరేలా స్పందించే వారేమో గానీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఒక కార్యకర్త పార్టీ అధినేతను కలవలేక ప్యాలెస్ గేటు బయట నిరసనకు దిగడం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం పనిచేసిన వారికీ చివరికి ఇదే పరిస్థితి ఎదురవుతుందా అనే ప్రశ్నను ఈ ఘటన లేవనెత్తుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.