మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పెన్షన్లు రద్దు చేయాలి
మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పెన్షన్లు రద్దు చేయాలి: హై కోర్టు న్యాయవాది ఆర్ కరుణాకర్
ప్రజాధనం దుబారా కాకుండా పేదలు, అర్హులకు వినియోగించాలి
మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు ప్రభుత్వాలు చెల్లిస్తున్న నెలవారీ పెన్షన్లను రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది, ప్రశ్నించే గొంతు ఆర్. కరుణాకర్ డిమాండ్ చేశారు.
ఆర్థికంగా బలంగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఖజానా నుంచి పెన్షన్లు చెల్లించడం ప్రజాధన దుర్వినియోగమని ఆయన అన్నారు. పదవుల్లో ఉన్న సమయంలోనే అనేక మంది ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని, అలాంటి వారికి జీవితాంతం ప్రభుత్వ సాయం అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లకు కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుపేదలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వినియోగించాలని ఆర్. కరుణాకర్ కోరారు.
గతంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుల ఆదర్శాలను నేటి రాజకీయ నాయకులు పాటించాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీల పెన్షన్ల రద్దు కోసం ప్రజాస్వామ్యవాదులు ఉద్యమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.