మేడూరు, పెనుగొలను గ్రామాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహణ
గంపలగూడెం, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని మేడూరు, పెనుగొలను గ్రామాల్లో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యం, పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు.
మేడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఏ. చైతన్య భవాని మాట్లాడుతూ శిశువుల మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని తెలిపారు. జన్మించిన వెంటనే ముర్రిపాలు పట్టించడం వల్ల శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని చెప్పారు. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు.
విజయవాడ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ సీహెచ్. రమేష్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు సీజన్కు అనుగుణంగా లభించే ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని వివరించారు. అనంతరం తల్లులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జి. కళ్యాణి, కె. నాగలక్ష్మి, ఏఎన్ఎం కే. మణిమ్మ, గ్రామ పెద్దలు గల్లా సంగయ్య, తోట సత్యనారాయణ, నాగోల్ గోవర్ధన్, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
అదే విధంగా పెనుగొలను గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు పి.వి. సాయిలక్ష్మి, బి. నాగమణి, ఎం. స్వరూపరాణి, కే. లింగమ్మ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహార పదార్థాలను లబ్ధిదారులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.