మధిర: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మధిర: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో అలసత్వం
ఈనెల 19న ఖమ్మంలో జరిగే ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
మధిర: విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు.
మధిర పట్టణంలోని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం భవనంలో బుధవారం ఏఐఎస్ఎఫ్ మధిర మండల మహాసభ నిర్వహించారు. తొలుత వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్వీ కాంప్లెక్స్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఉద్యోగుల సంఘం భవనం వరకు విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు మడపల్లి లక్ష్మణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తక్షణమే సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే మంత్రుల శిబిర కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈనెల 19న ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, ఉగ్గం సురేష్, జిల్లా నాయకులు ఎంగల ఉజ్వల చరణ్, ఏఐఎస్ఎఫ్ మధిర మండల కన్వీనర్ కళ్లెం అశోక్, మండల నాయకులు ముడుపల్లి గోపి, ఎన్. వెంకటేశ్వర్లు, ముఖేష్, ఆకాష్, లక్ష్మణ్ రాజు, యశ్వంత్, అక్షిత, సత్య, నందిని, ప్రియాంక, గోపి, జెస్సి తదితరులు పాల్గొన్నారు.