ప్రతాపసింగారంలో దొంగలు పేట్రేగిపోతున్నారు
మూడు ఇళ్లలో విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లిన దుండగులు.. సెంట్రింగ్ బాక్సులు సైతం చోరీ
ఘట్కేసర్ | Ntoday News
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం ప్రాంతంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. స్థానికులకు కేటాయించిన 2BHK ఇళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకుని కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరింగ్ను కోసి ఎత్తుకెళ్లారు.
ఈ నెల 5న బి. కృష్ణ, సీహెచ్. శ్రీరాములు ఇళ్లలో, ఆదివారం గండి మహేశ్ ఇంట్లో విద్యుత్ వైరింగ్ చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. ఒక్కో ఇంటిలో విద్యుత్ వైరింగ్ కోసం రూ.20 వేలకు పైగా ఖర్చు చేసినట్లు వారు పేర్కొన్నారు.
15 సెంట్రింగ్ బాక్సులు చోరీ
ఇదే ప్రాంతంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న కే. రాజు ఇంటిని కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు 15 సెంట్రింగ్ బాక్సులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
వరుసగా అర్ధరాత్రి వేళల్లో చోరీలు జరుగుతున్నప్పటికీ పోలీసుల గస్తీ సరిగా ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ప్రాంతంలో పోలీసుల పెట్రోలింగ్ను పెంచాలని కోరుతున్నారు.
వరుస చోరీలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.