జగిత్యాల జిల్లా పోలీసుల విజ్ఞప్తి
జగిత్యాల జిల్లా పోలీసుల విజ్ఞప్తి: ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రుల నిర్వహణకు సహకరించాలి
జగిత్యాల
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ పూర్తి బందోబస్తు చర్యలు చేపట్టిందని జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు శాఖ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
ఉచిత ఆన్లైన్ నమోదు విధానం:
భద్రత మరియు బందోబస్తు సేవలను సులువుగా అందించేందుకే ఆన్లైన్ నమోదు విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్పీ తెలిపారు. దీనికి ఎటువంటి రుసుము ఉండదు.
మండప నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in: పోర్టల్ ద్వారా మొబైల్ లేదా కంప్యూటర్ నందు ముందస్తుగా వివరాలు నమోదు చేసుకోవాలి.
అప్లికేషన్ కాపీని సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలి.
మండప నిర్వాహకులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు:
అనుమతులు & ట్రాఫిక్: ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలి. విద్యుత్ శాఖ అనుమతి పత్రంతోనే కనెక్షన్ తీసుకోవాలి.
భద్రత & సీసీ కెమెరాలు: ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలి. 24 గంటలూ అందుబాటులో ఉండేలా 4 గురు వాలంటీర్లను నియమించాలి.
కమిటీ వివరాలు: బాధ్యుల పేర్లు, ఫోన్ నంబర్ల వివరాలను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి.
అగ్నిమాపక జాగ్రత్తలు: షార్ట్ సర్క్యూట్ కాకుండా నాణ్యమైన షెడ్డు నిర్మించాలి. ముందు జాగ్రత్తగా ఫైర్ ఎక్స్టింగ్వైషర్, నీరు, ఇసుక డ్రమ్ములను సిద్ధంగా ఉంచుకోవాలి.
సౌండ్ సిస్టమ్స్ & డిజేలపై నిషేధం: మండపాల్లో మరియు శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా చిన్న స్పీకర్లను రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. భక్తిగీతాలు మాత్రమే ప్లే చేయాలి.
పూర్తి నిషేధం: మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం, అసభ్యకర నృత్యాలు, ఇతరులను లేదా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.
శోభాయాత్ర మరియు నిమజ్జన జాగ్రత్తలు:
శోభాయాత్రలో టపాసులు పేల్చడం, ఇతరులపై రంగులు చల్లడం, అనుచిత నినాదాలు చేయడం నిషేధం.
యాత్రకు ఉపయోగించే వాహనాలు మంచి కండిషన్లో ఉండాలి. డ్రైవర్కు లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరి.
మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయి.
శోభాయాత్రను నిర్ణీత సమయానికి ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా పోలీసులకు సహకరించాలి.
మహిళలు, పిల్లల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, వారికి ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.