మధిరలో ఘనంగా సామూహిక కుంకుమార్చన..
మధిరలో ఘనంగా సామూహిక కుంకుమార్చన.. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండల కేంద్రంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కళ్యాణ మండపం ఆవరణలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అనంత శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత కథ పారాయణం నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
మధిర ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో లలితాదేవి పారాయణం, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాస పూజా కార్యక్రమాలతో మధిరలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.