మధిరలో మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులతో మార్కెట్ కమిటీ కీలక సమావేశం
ట్రేడింగ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు
మధిర, ఖమ్మం జిల్లా :
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మిర్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ నిబంధనలు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణపై కీలకంగా చర్చించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ మధిర మార్కెట్ కమిటీ పరిధిలో మిర్చి వ్యాపారం నిర్వహించే ప్రతి వ్యాపారి, కోల్డ్ స్టోరేజ్ యజమాని తప్పనిసరిగా ట్రేడింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు. మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యాపారులు మార్కెట్ కమిటీ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. అనధికారిక వ్యాపార కార్యకలాపాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం అన్ని కార్యకలాపాలు జరగాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు మార్కెట్ కమిటీ సూచనలను అంగీకరించారు. నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్సులు పొందేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్ తనిఖీ బృందం టీమ్ లీడర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ జె. నరేందర్, తనిఖీ బృందం సభ్యులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు పాల్గొన్నారు.