మతోన్మాద ఫాసిస్ట్ శక్తులపై వామపక్షాలు ఐక్యంగా పోరాడాలి: డి. హరినాథ్
విజయవాడలో ఎంసీపీఐ(యూ) విలీనాన్ని పురస్కరించుకుని నిర్వహించిన "నేటి రాజకీయ పరిస్థితి – వామపక్షాల కర్తవ్యం" సదస్సులో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ ప్రసంగించారు. దేశంలో ఎన్డీఏ పాలనలో మతోన్మాద, ఫాసిస్టు శక్తులు మైనారిటీలు, దళితులు, ప్రజాస్వామ్యవాదులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని వామపక్ష శక్తులు ఐక్యంగా ముందుకు వచ్చి వాటిని ఓడించాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పాలకులు అదే రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. "ఆపరేషన్ కగార్" పేరుతో నరమేధం సృష్టించారని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం వారికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జి, తుపాకుల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ కుంభకోణం, నిరుద్యోగం వంటి సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో చారిత్రక ఘట్టంగా నిలిచాయని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని అన్నారు.
వామపక్ష ఐక్యత కోసం ఓంకార్ చేసిన కృషిని కొనియాడిన హరినాథ్, ప్రజాపక్ష వైఖరితో అసెంబ్లీలో గళం వినిపించిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందాన్ని పునఃసమీక్షించకపోతే పాడి పరిశ్రమ, రొయ్యల రైతులు, కోట్లాది ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి ఎంసీపీఐ నేత ఎం. వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించగా, జనరల్ సెక్రటరీ ఎం. అశోక్ ఓంకార్, కాటం నాగభూషణం, గొల్లపూడి ప్రసాద్, ఖాదర్ బాషా, మన్నవ హరిప్రసాద్, సీపీఎం నుంచి కృష్ణయ్య, సీపీఐ(ఎంఎల్) రెడ్ స్టార్ నుంచి అమర్ నాథ్, ఎస్యూసీఐ నుంచి ప్రతినిధులు, పోలారి (న్యూ డెమోక్రసీ), మరీదు ప్రసాద్ (రెడ్ ఫ్లాగ్), రంబాల రమేష్ (ఆర్ఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.