మ్యాజిక్లో ఉండేది సైన్స్ సూత్రాలే
మ్యాజిక్లో ఉండేది సైన్స్ సూత్రాలే
తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాల నిర్మూలనపై సైన్స్ సూత్రాల ఆధారంగా ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇంద్రజాల నిపుణుడు వి. బాల బయ్యన్న మాట్లాడుతూ మ్యాజిక్ చేసే వారికి ఎలాంటి అతీంద్రియ శక్తులు ఉండవని, పూర్తిగా సైన్స్ సూత్రాలు, హస్తలాఘవం ఆధారంగానే ఇంద్రజాల ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. కొందరు ఇదే హస్తలాఘవాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి బి. రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్, ప్రధానోపాధ్యాయులు డి. శరత్ బాబు, కె. కొండలరావు, జిల్లా కార్యదర్శి ఎం. రాం ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్. రాం కుమార్, నాయకులు ఏ. రవీంద్ర, వి. తేజస్విని తదితరులు పాల్గొన్నారు.