నేటి నుంచి సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ అమల్లోకి
న్యూఢిల్లీ | Ntoday News
రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ను నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.
యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కూడా యాప్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువుల లభ్యత, కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
యాప్ను వినియోగించాలంటే రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు (ID) కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే రైతు భరోసా, రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.