పెనుగొలనులో లోకం సుభిక్షంగా ఉండాలని నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను: లోకం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ పెనుగొలను గ్రామంలో ఆదివారం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా మందిరం నుంచి భక్తులు బయలుదేరి గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా నామస్మరణ చేస్తూ సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’, ‘శ్రీరామ జయరామ జయజయరామ’ నామాలను పారాయణం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
పెనుగొలనులో హనుమాన్ చాలీసా పారాయణం
పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద శనివారం రాత్రి భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బండారు గోపి ఆర్థిక సహకారంతో వివిధ రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను నిర్వాహకులు బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు, పాశం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.