నూజివీడులో మద్యం అమ్మకాలకు ఊపు.. జూలైలో 22 శాతం వృద్ధి
నూజివీడులో మద్యం అమ్మకాలకు ఊపు.. జూలైలో 22 శాతం వృద్ధి
"నవోదయం–2.0" ప్రభావంతో అక్రమ నాటుసారాకు అడ్డుకట్ట.. పెరిగిన అధికారిక విక్రయాలు
నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2026 జూలై నెలలో మద్యం అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2025 జూలైలో ₹13.63 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదుకాగా, 2026 జూలైలో అవి ₹16.57 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ₹2.94 కోట్ల అదనపు విక్రయాలు నమోదై, గత ఏడాదితో పోల్చితే సుమారు 22 శాతం వృద్ధి నమోదైంది.
అలాగే, 2024 జూలైలో కేవలం ₹9.76 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదుకాగా, 2026 జూలై నాటికి అవి ₹16.57 కోట్లకు చేరడం ద్వారా 69.77 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "నవోదయం–2.0" కార్యక్రమం కింద నాటుసారా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపు, విక్రయాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ నిరంతర ప్రత్యేక దాడులు, కట్టుదిట్టమైన నిఘా చేపట్టింది. ఈ చర్యలతో అక్రమ మద్యం లభ్యత గణనీయంగా తగ్గి, అధికారిక మద్యం విక్రయాలు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ గణాంకాలు "నవోదయం–2.0" కార్యక్రమం అక్రమ నాటుసారా నిర్మూలనలో సాధిస్తున్న ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య మొబైల్ నంబర్ 9440902462కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.