ఊటుకూరులో గ్రోమోర్ కేంద్రంపై ఆర్డీవో ఆకస్మిక తనిఖీ యూరియా పంపిణీని పరిశీలించి రైతులకు సూచనలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని గ్రోమోర్ కేంద్రాన్ని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేదా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు ఎరువులు విక్రయించాలని నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం కేంద్రానికి వచ్చిన రైతులకు యూరియాను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని, రైతులకు అవసరమైన ఎరువులు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీవో ఆదేశించారు.