పెనుగొలనులో అరబిందో ఘోష్ 154వ జయంతి వేడుకలు
పెనుగొలనులో అరబిందో ఘోష్ 154వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, యోగా గురువు, కవి అరబిందో ఘోష్ 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జరిగిన సభలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ అరబిందో ఘోష్ 1872 ఆగస్టు 15న కేడీ ఘోష్, స్వర్ణలతాదేవి దంపతులకు జన్మించారని తెలిపారు. అరబిందో బహుముఖ ప్రజ్ఞాశాలి అని, విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం దేశ పరిస్థితులను గమనించి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు.
టీచర్ కె. లింగమ్మ మాట్లాడుతూ అరబిందో తన పత్రికలు, వార్తాపత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అనేక రచనలు చేశారని తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక ఆలోచనలు, తత్వబోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు డి. రామాంజనమ్మ, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.