పెనుగొలనులో ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం
పెనుగొలనులో ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శనివారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ప్రముఖుల చిత్రాలను ప్రదర్శించారు. జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సమరయోధుల స్మరణార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలని గాంధీ ఇచ్చిన పిలుపు స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టంగా నిలిచిందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్ర చర్యలకు పాల్పడినా ప్రజల పోరాట స్ఫూర్తి తగ్గలేదని, చివరకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించే వరకు ఈ ఉద్యమం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.
సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో వేలాది మంది పాల్గొని ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుగా తాము భారతీయులమనే భావనతో ఐక్యత, దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాళ్లచర్ల జగన్నాథం, బాణాల నరేష్, అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.